నేటి సాక్షి (భూమయ్య )తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ పరీక్షా శిబిరం ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. లయన్స్ క్లబ్ అధ్యక్షులు, నాచారం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, “మధుమేహం మన ఆరోగ్యానికి సైలెంట్ కిల్లర్ లాంటిదే. దానిని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, నియంత్రణలో ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత” అన్నారు.సుష్మా హాస్పిటల్ ఆవరణలో ప్రతి రోజు సాధారణ షుగర్ స్క్రీనింగ్ క్యాంప్ కొనసాగుతుండగా, ప్రతి ఆదివారం ప్రత్యేక “మేఘా క్యాంప్” నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ, “మధుమేహం అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండే వ్యాధి. ఇది శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం లేదా దానిని సరిగా వినియోగించకపోవడం వల్ల ఏర్పడుతుంది” అని వివరించారు.డాక్టర్ ప్రదీప్ సింహ మాట్లాడుతూ, “అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, అకస్మాత్తుగా బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు మధుమేహ సూచనలు కావచ్చు. గ్లూకోజ్ మన కండరాలకు ప్రధాన ఇంధనం” అని అన్నారు.లయన్ లేడీ డాక్టర్ సుష్మాదేవి మాట్లాడుతూ, “ఇన్సులిన్ హార్మోన్ మనం తీసుకునే ఆహారంలోని గ్లూకోజ్ను కణాలలోకి చేర్చడానికి సహాయపడుతుంది. అందువల్ల దాని సక్రమ ఉత్పత్తి అత్యంత కీలకం” అన్నారు.లయన్ డాక్టర్ జానకిరామ్ సి.ఆర్ మాట్లాడుతూ, “మధుమేహం కనిపించని వ్యాధి అయినా దాని ప్రభావం విస్తారమైనది. మానసిక ప్రశాంతత, వ్యాయామం, సమయపాలన ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ఉచిత షుగర్ స్క్రీనింగ్ ద్వారా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో లయన్ మహమ్మద్ హమ్మద్, లయన్ డాక్టర్ అప్సర్ భాయ్, లయన్ తాడూరు కృష్ణా రెడ్డి, లయన్ జగ్గన్నగారి దామోదర్ రెడ్డి, డాక్టర్ సింధు, కొక్కొండ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





