*నేటి సాక్షి – మెట్ పల్లి*( రాధారపు నర్సయ్య )మెట్ పల్లి మండల పరిధిలోని చౌలమద్ది, రామారావుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ బి.ఎస్.లత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.*సదుపాయాలపై సూచనలు*కొనుగోలు కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, ప్యాడి క్లీనర్స్, టార్పాలిన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు. అలాగే రైతులకు అవసరమైన మద్దతు ధర వివరాలు, టోల్ఫ్రీ నంబర్ వంటి సమాచారం స్పష్టంగా కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.రైతులు ధాన్యం కేంద్రాలకు తీసుకురాగానే రసీదులు ఇవ్వడంతో పాటు వారి బ్యాంకు వివరాలను సక్రమంగా నమోదు చేసి, పంట రుసుమును సకాలంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని రకాల రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.*రైతులకు సూచనలు*అనంతరం అదనపు కలెక్టర్ లత రైతులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ సీజన్లో పంటకు మద్దతు ధరగా ఏ గ్రేడ్ రకానికి ₹.2389, బి గ్రేడ్ రకానికి ₹.2369 నిర్ణయించిందని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే అందించాలని, ప్రైవేట్ వ్యాపారుల చెరలో పడకూడదని సూచించారు. ధాన్యాన్ని పూర్తిగా శుభ్రపరచి, తగిన తేమ శాతం (17% లోపు) కలిగిన తర్వాత మాత్రమే తూకానికి ఇవ్వాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా రైతులు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1800-425-8187 కు కాల్ చేయాలని వివరించారు.ఈ తనిఖీలో మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఎమ్మార్వో, వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై శాఖల అధికారులు పాల్గొన్నారు.____





