నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా మల్యాలలో గురువారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ గేటు గోడ ఎక్కి ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సమయానికి అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు కలసి అతడిని కిందకు దింపి ప్రాణాపాయం నుండి రక్షించారు.*తల్లి మరణంపై అనుమానం – చర్యలు లేవని ఆరోపణ*వివరాల్లోకి వెళ్తే, నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీకి చెందిన మహ్మద్ అఖిల్ అనే యువకుడి తల్లి అన్వర్ బేగం ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మరణించింది. ఆ ఘటన వెనుక ఉన్న కారణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అఖిల్ పలుమార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు.*గోడ ఎక్కి పెట్రోల్ పోసుకున్న యువకుడు*పోలీసులు తన ఫిర్యాదుపై స్పందించడం లేదన్న ఆవేదనతో గురువారం ఉదయం మల్యాల పోలీస్ స్టేషన్ గేటు వద్ద గోడపైకి ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు అఖిల్. నిప్పు అంటించుకునే లోపే అక్కడ ఉన్న పోలీసులు, ప్రజలు అతడిని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.*‘తల్లికి న్యాయం కావాలి’ – అఖిల్ ఆవేదన*అఖిల్ మాట్లాడుతూ, ‘నా తల్లి చనిపోయిన తర్వాత కూడా పోలీస్లు ఏ చర్య తీసుకోవడం లేదని అఖిల్ ఆరోపించారు. ఆమె ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించకపోతే నాకు న్యాయం జరిగేలా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లికి న్యాయం చేయకపోతే మరింత తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.*పోలీసుల సమయస్ఫూర్తితో తప్పిన పెద్ద ప్రమాదం*స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మల్యాల పోలీసులు తెలిపారు._____





