నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)సత్యవేడు నియోజకవర్గం ఓలూరు రాయల చెరువు తెగిపోవడంతో కలత్తూరు, కలత్తూరు హరిజనవాడ, పాతపాలెం గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. గ్రామస్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. అక్కడి హృదయ విధారక దృశ్యాలని చూసి చలించిన ఎంపీ గ్రామస్థులకు దైర్యం చెప్పారు. కష్ట సమయంలో అండగా ఉంటామని పునరావాసం కోసం తగిన ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎంపీ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించిన ఎంపీ, అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత గ్రామాలలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా పరిహారం ప్రకటించి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.





