నేటి సాక్షి, బెజ్జంకిబెజ్జంకి మండల కేంద్రంలో రైతు కుటుంబం కష్టానికి అగ్నిప్రమాదం దెబ్బ తగిలింది. శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఇంటి ఆవరణలో ఆరబెట్టిన సుమారు 300 క్వింటాళ్ల పత్తి పూర్తిగా దగ్ధం అయ్యింది. స్థానిక రైతు బండి ఐలయ్య పత్తి సాగుకు తన పది ఎకరాల భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. తేమ తగ్గించేందుకు ఇంటి పక్కనే టార్పాలిన్లు వేసి పత్తిని ఆరబెట్టారు. మధ్యాహ్నం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.కుటుంబసభ్యులైన రమేష్, అనిల్, ఇతరులు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. “మొత్తం ఒక ఏడాది పని క్షణాల్లో బూడిదయింది” అంటూ రైతు ఐలయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు.స్థలాన్ని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య పరిశీలించారు. బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని స్థానిక రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.





