నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం, ఎరుకల కులానికి చెందిన యువకుడు బడనపురి గోపాల్పై జరిగిన భౌతిక దాడి దారుణమని తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మద్దిల గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించినట్లయితే, గోపాల్ ఇంటిలోకి చొరబడి కొంతమంది వ్యక్తులు దారుణంగా దాడి చేశారని, కత్తితో గొంతు కోయడానికి ప్రయత్నించి ఎడమ తొడపై, మెడపై తీవ్ర గాయాలు చేశారని ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ దాడి పూర్తిగా కుల వివక్షతో ప్రేరేపితమైందని, ఇటీవల ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని ఎస్టీ కమిషన్ కు వివరించారు.ఎంపీ గురుమూర్తి ఈ ఘటనను అత్యంత దుర్మార్గమైన, అమానుషమైన చర్యగా పేర్కొన్నారు. ఈ దాడి కేవలం ఒక వ్యక్తిపై కాకుండా, సమాజంలోని గిరిజన హక్కులపై దాడిగా భావిస్తున్నామని తెలిపారు. “ప్రశ్నిస్తే గొంతులు కోస్తారా” కుల వివక్షతో ప్రేరేపితమైన ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం” అని ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని, ఇది సామాజిక సమానత్వానికి పెద్ద ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.జాతీయ ఎస్టీ కమిషన్ను , ఈ దాడి పై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల నివారణ చట్టం, 1989 ప్రకారం విచారించాలని తిరుపతి ఎంపీ విజ్ఞప్తి చేశారు. కమిషన్ వెంటనే సుమోటుగా విచారణ ప్రారంభించి, బాధితుడు గోపాల్, అతని కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించడంతో పాటు తక్షణ పరిహారం చెల్లించాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందిగా ఎంపీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు.





