నేటి సాక్షి – మల్లాపూర్*( పెంబి మహేష్ )నిత్యం అవమానకర మాటలు, మానసిక వేధింపులతో భర్తను భరించలేని భార్య… ఆ కోపావేశంలో కత్తి పట్టుకుని మెడపై దాడి చేసి హత్య చేసి, వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.*నిత్య కలహాలు… మానసిక ఒత్తిడి*మల్లాపూర్ లో నివసిస్తున్న పల్లికొండ మల్లయ్య (45), రాజు (40) దంపతుల మధ్య గత కొంత కాలంగా తీవ్రమైన కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. మల్లయ్య తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య రాజుతో దురుసుగా మాట్లాడేవాడు, అవమానకరమైన మాటలు అనేవాడు. ఎన్నిసార్లు బుజ్జగించినా మారని మల్లయ్య వల్ల రాజు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న రాత్రి కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.*కత్తి దాడి… దారుణ హత్య*బుధవారం ఉదయం మళ్లీ గొడవ మొదలైంది. మల్లయ్య మళ్లీ దుర్భాషలాడటంతో ఆవేశంలో ఉన్న రాజు వంటగది నుంచి కత్తి తీసుకొని భర్త మెడపై గట్టిగా దాడి చేసింది. గాయాలతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తమోడుతూ కుప్పకూలిన భర్తను చూసినా రాజు భయపడలేదు… వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి మల్లాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ‘నేనే నా భర్తను చంపాను’ అంటూ లొంగిపోయింది.*’ఎన్నిసార్లు చెప్పినా వినలేదు… భరించలేక..’*ఆమె కోడలు లాస్య మీడియాతో మాట్లాడుతూ… ‘అత్తయ్య ఎన్నిసార్లు అడ్డుకున్నా, బుజ్జగించినా మామయ్య వినేవాడు కాదు. నిత్యం తిట్టడం, అవమానించడం… అది భరించలేకనే ఈ రోజు ఇలా జరిగింద’ని కన్నీరు పెట్టుకుంది. సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న మల్లాపూర్ పోలీసులు స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు… కుటుంబ కలహాలు, మానసిక వేధింపులే హత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.ఈ దారుణ ఘటనతో మల్లాపూర్ పట్టణమంతా కలవరంలో మునిగింది. కుటుంబ కలహాలు ఇంత దారుణానికి దారి తీస్తాయని ఎవరూ ఊహించలేదు.___





