నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం ర్యాగింగ్, మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ర్యాగింగ్ చట్టరీత్యా తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు, జైలు శిక్ష, కళాశాల నుండి బహిష్కరణ, స్కాలర్షిప్ రద్దు, భవిష్యత్తులో ప్రభుత్వ–ప్రైవేట్ ఉద్యోగాల్లో అనర్హత వంటి భయంకరమైన పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. ర్యాగింగ్ బాధితుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని, గతంలో అనేక విద్యార్థులు జీవితాన్ని కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. సీనియర్లు జూనియర్లను భయపెట్టకుండా స్నేహపూర్వకంగా మార్గనిర్దేశనం చేయాలని సూచించారు.*మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేస్తాయి — డ్రగ్స్పై పట్టు సడలదన్న ఎస్పీ*డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్తు మీద మచ్చలా మారుతాయని ఎస్పీ హెచ్చరించారు. అలవాటు పడితే చదువు, కెరీర్, వ్యక్తిగత జీవితం మొత్తం దెబ్బతింటుందని, ఇటువంటివి జీవితాన్ని బోల్తా కొట్టించే ప్రమాదకర వ్యసనాలని వివరించారు. మత్తు పదార్థాల గురించి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకుంటారని, ఎవరైనా ఇలాంటి వ్యసనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను వెంటనే కౌన్సెలింగ్కి తీసుకెళ్లాలని చెప్పారు. డ్రగ్స్ను పూర్తిగా దూరం పెట్టి..ఉత్తమ వైద్యులుగా ఎదిగి, కళాశాలకు మంచి పేరు తీసుకురండని విద్యార్థులను ప్రోత్సహించారు.*సురక్షిత క్యాంపస్ కోసం అందరి సహకారం అవసరం — యాంటీ ర్యాగింగ్ ప్రతిజ్ఞ*కాలేజీ ప్రాంగణం పూర్తిగా సురక్షిత వాతావరణంగా ఉండేందుకు ప్రతి విద్యార్థి సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ర్యాగింగ్ ఘటన ఎక్కడైనా ఎదురైతే వెంటనే 100 నంబర్కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలను మరింత బలపరచాలని అధ్యాపకులకు సూచించారు. అనంతరం ఎస్పీ యాంటీ-ర్యాగింగ్ పోస్టర్లను ఆవిష్కరించి, విద్యార్థులతో యాంటీ-ర్యాగింగ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కుమార్, HOD కాద్రి, అధ్యాపకులు, దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు._____





