నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్ 02: అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎఐఎంఎస్ఆర్) పరిధిలోని కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నిర్వహించిన 2020 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విద్యా ప్రమాణాల్లో నూతనోత్సాహాన్ని నెలకొల్పుతూ, వరుసగా వంద శాతం ఫలితాలు సాధిస్తూ, మెరుగైన ప్లేస్మెంట్లు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఈ కళాశాల నుంచి మరో బ్యాచ్ విజయవంతంగా పట్టాలు అందుకోవడంతో, మొత్తం క్యాంపస్ ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్ మాట్లాడుతూ “ఫిజియోథెరపీ పుట్టుక నుంచి జీవనాంతం వరకు ప్రతి దశలో కీలక పాత్ర పోషించే గొప్ప వైద్య రంగం. ప్రపంచవ్యాప్తంగా ఫిజియోథెరపిస్ట్లకు అవకాశాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. డిగ్రీతో ఆగిపోకుండా స్పెషలైజేషన్లలో ముందుకు సాగుతూ తల్లిదండ్రులు–సంస్థ పేరు, గౌరవం నిలబెట్టాలి” అని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వి. కిరణ్ మాట్లాడుతూ “ఫిజియోథెరపీ మనిషి జీవితంలోని ప్రతి దశకు అవసరమైన వైద్యసేవ. విద్యార్థులు తమ జ్ఞానం, నైపుణ్యాన్ని సేవాభావంతో సమాజానికి అందించాలి” అని కోరారు. ఈ ఏడాది విద్యార్థులంతా తమ ఇంటర్న్షిప్లను విజయవంతంగా పూర్తి చేసి గ్రాడ్యుయేషన్కు అర్హులయ్యారని, ఇప్పటి వరకు మూడు బ్యాచ్లు వరుసగా వంద శాతం ఫలితాలు సాధించడం ఈ కళాశాల ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి చేర్చిందని పేర్కొన్నారు. ప్లేస్మెంట్లలోనూ కాలేజ్ నిరంతర పురోగతి కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం పలువురు విద్యార్థులు అపోలో ఆసుపత్రులలోనే నియామకాలు పొందగా, మరికొందరు ఇతర ప్రముఖ వైద్య సంస్థల్లో ఉద్యోగాలు సాధించారని డా. కిరణ్ తెలిపారు. కార్యక్రమంలో ఎఐఎంఎస్ఆర్ డీన్ డాక్టర్ అల్ఫ్రెడ్ జె. ఆగస్టిన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు, అసోసియేట్ డీన్ డాక్టర్ రమ్యా రామకృష్ణన్, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె. భాస్కర్రెడ్డి పాల్గొని గ్రాడ్యుయేట్లను అభినందించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.





