నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. రాయికల్ మండలంలోని వడ్డె లింగాపూర్, కొత్తపేట, అల్లీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్వయంగా సందర్శించి పరిశీలించారు. గెజిట్ రిజర్వేషన్ వివరాలు నోటీసు బోర్డులపై సక్రమంగా ప్రదర్శించబడ్డాయా, ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు స్వీకరించబడ్డాయన్న అంశాలపై సంబంధిత అధికారుల నుంచి కలెక్టర్ వివరాలు సేకరించారు.*నామినేషన్ల పరిశీలన, రికార్డు నిర్వహణ పైన దృష్టి*నామినేషన్ దరఖాస్తులు తీసుకున్న వారి వివరాలు రిజిస్టర్లో స్పష్టంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన రిపోర్టులు సకాలంలో జిల్లా కేంద్రానికి పంపాలని ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ, రికార్డు నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులకు అందిస్తున్న సౌకర్యాలు వంటి అంశాలపై ఆయన పలు సూచనలు చేస్తూ, ప్రతి కేంద్రంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని, అధికారులు అభ్యర్థులకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు.*పోలింగ్ షెడ్యూల్ స్పష్టం-ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి*ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నామినేషన్ ప్రక్రియను చట్టబద్ధంగా, ఎవరికీ ఇబ్బందులు కలగకుండా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించగా, డిసెంబర్ 3న పరిశీలన జరగనుంది. డిసెంబర్ 6 వరకు ఉపసంహరణ గడువు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డుల్లో డిసెంబర్ 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు.ఈ పరిశీలనా కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎమ్మార్వో నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు._____





