నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 03 ~అన్నమయ్య జిల్లా :-: అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారిపోయిందంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర అరటి గురించి పార్లమెంట్లో చర్చించాలంటూ కాంగ్రెస్ ఎంపీ, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో అరటి పంటకు కిలో ధర కేవలం యాభై పైసలకు పడిపోవడం రైతులకు తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని కలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితిపై పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరగాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు. హర్షకుమార్ తన లేఖలో ”అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారడం రైతుల్ని నిరాశలోకి నెట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో అరటికి భారీ డిమాండ్, భారీ ధరలున్నా ఏపీలో మాత్రం రైతులను అవమానించేకరంగా యాభై పైసలు మాత్రమే ఇస్తున్నారని అమెరికాలో డాలర్లు సంపాదిస్తుండగా ఆంధ్రప్రదేశ్ లోని రైతులు నష్టాల్లో మునిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మరియు లోక్సభ ఎంపీ మాణికం ఠాగూర్కు హర్ష కుమార్ లేఖ రాశారు. అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో ఆంధ్రా అరటి రైతుల సమస్యను తప్పనిసరిగా ప్రస్తావించాలని హర్ష కుమార్ కోరారు. మరో వైపు అరటి పంటను కనీస మద్దతు ధర (MSP) తో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని హర్ష కుమార్ కేంద్రానికి సూచించారు. రైతుల నష్టాలను తగ్గించేందుకు ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహమివ్వాలని పంట నిల్వకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కేంద్రం సమాధానం చెప్పాలని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు..~~~~~~~~~~~~~~~~~~





