నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్ 03: యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ (యుకే) ప్రతినిధి బృందం తమ రెండు రోజుల అకడమిక్ పర్యటనలో భాగంగా బుధవారం ది అపోలో యూనివర్శిటీకి చేరుకుంది. స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అండ్ మాథమెటికల్ సైన్సెస్ హెడ్ ప్రొఫెసర్ లీనా సోదా, కంప్యూటర్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. రాయ్ క్రోల్ నేతృత్వంలోని ఈ బృందం యుకేలో విద్యావకాశాలు, గ్లోబల్ కెరీర్ నిర్మాణానికి అవసరమైన నైపుణ్యాలు, లీసెస్టర్ యూనివర్శిటీలోని విద్యా ప్రాధాన్యతలను అపోలో విద్యార్థులకు వివరించారు.క్యాంపస్ పరిచయంతో లీసెస్టర్ బృందం పర్యటన ప్రారంభమైంది. అనంతరం జరిగిన సమావేశంలో అపోలో యూనివర్శిటీ వైస్–చాన్స్లర్ డా. హెచ్. వినోద్ భట్ మాట్లాడుతూ, అంతర్జాతీయ విద్యా మార్పిడి, మెడికల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత, గ్లోబల్ ఎడ్యుకేషన్లో లీసెస్టర్ యూనివర్శిటీ స్థానాన్ని వివరించారు. భారతీయ విద్యార్థులకు లీసెస్టర్ లో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. భారత విద్యార్థులను ఇండియా అంబాసిడర్లుగా చూడాలని కోరారు.ప్రొఫెసర్ లీనా సోదా మాట్లాడుతూ, లీసెస్టర్ యూనివర్శిటీలో సుమారు రెండువేల ఐదువందల మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. కంప్యూటింగ్ విద్యలో తమ విశ్వవిద్యాలయం అగ్రగామిగా నిలుస్తోందని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నూతన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. భారతదేశంలో అపోలోతో సహా పలు ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడం వలన పరిశోధన, అకడమిక్ మార్పిడి, గ్లోబల్ ఎక్స్పోజర్ మరింతగా పెరుగుతున్నాయని వివరించారు.అనంతరం లీసెస్టర్ యూనివర్శిటీ ప్రతినిధులు 2+1 బీఇంగ్ కంప్యూటర్స్ విద్యార్థులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. విద్యార్థులు అడిగిన సందేహాలకు యుకే ఫ్యాకల్టీ ప్రత్యక్షంగా సమాధానాలు ఇచ్చారు. లీసెస్టర్ లో లభ్యమయ్యే అకడమిక్ అవకాశాలు, యుకేలో ఉన్నత విద్యా మార్గాలు, గ్లోబల్ కెరీర్ కోసం అవసరమైన నైపుణ్యాలు, అక్కడి విద్యా ప్రమాణాలు వంటి అంశాలను వివరంగా విద్యార్థులకు తెలిపారు.అనంతరం రెండు సంస్థల సీనియర్ అకడమిక్ బృందాలు దీర్ఘకాలిక సహకారం, విద్యార్థుల అడ్మిషన్ విధానం, లీసెస్టర్కు ట్రాన్సిషన్ ప్రాసెస్, స్ప్రింగ్ వీక్–2026 రూపకల్పన వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించాయి. ముఖ్యంగా 2+1 బీఇంగ్ (కంప్యూటర్ సైన్స్) ప్రోగ్రామ్ను మరింత బలోపేతం చేయడం, సంయుక్త అకడమిక్ కార్యక్రమాలు చేపట్టడం, స్టూడెంట్ ఎక్స్చేంజ్ అవకాశాలను విస్తరించడంపై రెండు సంస్థలు ప్రాథమిక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు, డీన్స్ ప్రొఫెసర్ డి. జగదీశన్, ప్రొఫెసర్ కె.భాస్కర్రెడ్డి, డాక్టర్ రామయ్య ఇటుమల్ల,ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వివేకానందన్, అంతర్జాతీయ వ్యవహారాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కీర్తన, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.





