నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం చెక్పోస్ట్ను పరిశీలిస్తూ తనిఖీ వ్యవస్థను సమీక్షించారు. ప్రతి వాహనాన్ని పకడ్బందీగా చెక్ చేయాలని, అక్రమ నగదు, మద్యం, బహుమతుల రూపంలో జరిగే ఎలాంటి ఎన్నికల ప్రలోభాలకూ తావులేకుండా కఠిన నిఘా కొనసాగుతున్నట్టు తెలిపారు.*ఎన్నికల వాతావరణంలో పర్యవేక్షణ బలోపేతం*ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అవసరమైన పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తే సీజ్ చేయడం అవశ్యమవుతుంది. ప్రజలు మరియు నాయకులు చట్టం ప్రకారం పత్రాలు వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.*పోలింగ్ కేంద్రాల భద్రత పరిశీలన..మౌలిక సదుపాయాలపై దృష్టి*అనంతరం ఎస్పీ అశోక్ కుమార్ వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ రావ్ పేట గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రహరీ గోడ, విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రవేశ ద్వారాల వంటి మౌలిక వసతులను పరిశీలించి ఎన్నికల రోజున ఎలాంటి అంతరాయం లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నదని తెలిపారు.ఎస్పీతో ధర్మపురి సీఐ రాం నరసింహ రెడ్డి, ఎస్ఐలు మహేష్, ఉదయ్, చెక్పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు._____





