నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 08 ~అన్నమయ్య జిల్లా :-: బైక్ పై ఇంటికెళ్తుండగా కుక్కలు వెంబడించడంతో వాటిని తప్పించుకునే క్రమంలో ఓ యువకుడు అదుపు తప్పి బైక్ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగింది. వివరాల్లోకెళ్తే రాయచోటి పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో నివాసం ఉండే ఫజిల్ (42) ఆదివారం రాత్రి గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్ స్టేషన్ దారి గుండా ద్విచక్ర వాహనంపై తన ఇంటికి వెళ్తున్నాడు. అయితే అతన్ని చూసిన కొన్ని వీధికుక్కలు బైక్ను వెంబడించాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక కుక్కల భారీ నుంచి తప్పించుకునే క్రమంలో అతను ప్రయాణిస్తున్న బైకును వేగంగా నడిపాడు. చీకటి కావడంతో అనుకోకుండా ఎదురుగా ఉన్న గుడి గోడను బలంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన ఫజిల్ అక్కడికక్కడే మృతి చెందారు. శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకొని జరిగిన ఘటనను పోలీసులు తెలియజేశారు. సమాచారమందుకున్న రాయచోటి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.~~~~~~~~~~~~~~~~~~





