Friday, March 20, 2026

*వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఏటీఎంఏ) పథకం అమలు వివరాలు కోరిన ఎంపీ గురుమూర్తి*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)లోక్‌సభలో ఏటీఎంఏ పథకం అమలు, నిధుల కేటాయింపు, వినియోగం, రైతులకు అందించిన ప్రయోజనాలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సమగ్ర వివరాలు వెల్లడించింది. గత మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఏటీఎంఏ కింద రూ. 43.74 కోట్లు కేటాయించగా, రాష్ట్రం అధిక భాగం నిధులను వినియోగించినట్లు కేంద్రం తెలిపింది. తిరుపతి జిల్లాకు ఈ కాలంలో రూ. 7.24 లక్షలు కేటాయించగా, అవన్నీ పూర్తిగా వినియోగించారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు, రైతు ప్రదర్శనలు, ఎక్స్‌పోజర్ విజిట్లు, కిసాన్ మేళాలు, ఫార్మ్ స్కూల్స్ ద్వారా లక్షలాది మంది రైతులకు అవగాహన అందించగా, తిరుపతి జిల్లాలో 200కి పైగా కార్యక్రమాలు నిర్వహించి 7,800 మందికి పైగా రైతులను చేర్చుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ గురుమూర్తి, నిధులు కేటాయించినప్పటికీ రైతుల పెరుగుతున్న అవసరాలకు నిధులు సరిపోవడం లేదని కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రైతుల శిక్షణ దినాల పెంపు, రైతు సమూహాలను బలపరచడం, ఎఫ్‌పీవో అభివృద్ధి, వాతావరణ అనుకూల వ్యవసాయం, పంట తర్వాత నిర్వహణ వంటి కీలక రంగాల్లో ఇంకా బలోపేతం అవసరమని ఈ లేఖలో కోరారు. కేంద్రం నిర్వహించిన ప్రభావ అధ్యయనంలో కూడా ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అని స్పష్టమైన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఏటీఎంఏ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు అదనపు నిధులు, మార్గదర్శకాలు జారీ చేయాలని ఎంపీ గురుమూర్తి కేంద్రాన్ని కోరారు. ఏటీఎంఏ బలోపేతంతో ఏపీ రైతుల అవగాహన, ఉత్పాదకత, ఆదాయ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఎంపీ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News