నేటి సాక్షి,బాపట్ల జిల్లా (పర్చూరు)రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భేటీ అయ్యారు. బుధవారం సెక్రటేరియట్ లోని మంత్రి చాంబర్ లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఇటీవల నియోజకవర్గానికి మంజూరు చేసిన రూ.11 కోట్లు సీజీఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) నిధులపై ఎమ్మెల్యే ఏలూరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా నూతన ఆలయాల నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు. పలు దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదని తక్షణమే ఆలయాల పునర్ వైభవానికి కృషి చేయాలని కోరారు. *సీజీఎఫ్ పెండింగ్ నిధుల విడుదల కోరిన ఎమ్మెల్యే*సమావేశంలో ఇప్పటికే ప్రతిపాదించిన పలు ఆలయాల సీజీఎఫ్ ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. వాటిని త్వరితగతిన పరిశీలించి విడుదల చేయాలంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరారు. ఆలయాల పునరుద్ధరణ, మరమ్మతులు, నిర్మాణం వంటి కీలక పనులు అంశాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి కోరారు.*డిడిఎన్ఎస్ ప్రతిపాదనలకు ప్రాధాన్యం*డిడిఎన్ఎస్ పరిధిలో సమర్పించిన తాజా ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు కోరుకుంటున్న ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, ఆశాభవం వ్యక్తం చేశారు. పర్చూరు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రికి ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.*మంత్రి సానుకూల స్పందన*ఎమ్మెల్యే ఏలూరి పెండింగ్ అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలో పెండింగ్ అంశాలు అన్నిటిని పరిష్కరిస్తానన్నారు. సిజిఎఫ్ కింద అవసరమైన చోట నిధుల కేటాయింపులకు చర్యలు తీసుకుంటామని, పెండింగ్ లో ఉన్న డిడిఎన్ఎస్ ఫైల్స్ ను పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరితోపాటు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు లు ఉన్నారు.





