(నేటి సాక్షి)కుత్బుల్లాపూర్ జంట సర్కిల్ 25 , 26 పరిధిలో రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్లను న్యాయంగా అమలు చేయాలని మహా ఎమ్మార్పీఎస్ మేడ్చల్,మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ముత్యపాగ శ్రీశైలం మాదిగ. కుత్బుల్లాపూర్ జంట సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక ఉద్యమ నమస్కారాలతో అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏర్పడి ఇప్పటికే 20 సంవత్సరాలు కాగా, జిహెచ్ఎంసిలో విలీనమై 15 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. అప్పట్లో ఈ నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉన్నప్పటికీ, ఎస్సీ వర్గాలకు ఒక్క సీటు కూడా రిజర్వ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.తాజాగా 2025లో జరిగిన వార్డు డెలిమిటేషన్ అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 24 వార్డులు ఏర్పడ్డాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ అమలులో ఉన్న నేపథ్యంలో, రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్లను మాల, మాదిగ తదితర ఉపకులాల వారీగా అమలు చేసి, ఎస్సీ సమాజానికి నిజమైన సామాజిక న్యాయం కల్పించాలని కోరారు.దశాబ్దాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల సామాజిక, రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల ఈసారి జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో రిజర్వేషన్ విధానాన్ని పారదర్శకంగా, సముచితంగా అమలు చేసి, ఎస్సీ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని అధికారులను కోరారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎస్సీ జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ, గతంలో న్యాయం జరగలేదని, ఇకపై అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముత్యపాగ శ్రీశైలం మాదిగ తెలిపారు. ఈ అంశంపై డిప్యూటీ కమిషనర్లు సానుకూల నిర్ణయం తీసుకొని, రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎస్సీ వర్గాలకు తగిన రిజర్వేషన్లు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.





