*గ్రామీణ ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయి మౌలిక వసతులు** పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం కూటమి ప్రాధాన్యత* రావినూతల, చందలూరుల్లో జూనియర్ కళాశాలలు* సోలార్ తో తగ్గనున్న విద్యుత్ వినియోగ భారం* ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్నేటి సాక్షి,బాపట్ల జిల్లా (అద్దంకి) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గ్రామాల్లోనూ పట్టణాలకు ధీటుగా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని కొరిశపాడు మండలం, రావినూతల గ్రామంలో సోమవారం మంత్రి గొట్టిపాటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రూ.1.30 కోట్లతో నిర్మించిన అంతర్గత రహదారులు, కల్వర్టులు, సైడు కాల్వలను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఆ తరువాత రావినూతల గ్రామంలోనే రూ.20 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాలును మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూపేదలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా చెప్పారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో సుమారు 30 హెల్త్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఒక్కొక్కటీ రూ.36 లక్షలతో నిర్మించే హెల్త్ సబ్ సెంటర్లతో నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సెంటర్ల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాలను సంబంధిత తహశీల్దార్లు వెంటనే గుర్తించాలని ఆదేశించారు. ప్రైవేటు దాతలు స్థలాలు ఇవ్వడానికి ముందుకు వస్తే హెల్త్ సెంటర్లకు వారి పేర్లను పెట్టాలని మంత్రి సూచించారు. నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం తన బాధ్యత అన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూ.21.50 కోట్లు నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐదు మండలాల పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.సోలార్ వినియోగంతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం గణనీయంగా తగ్గుతుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గుజరాత్ రాష్ట్రం సోలార్ వినియోగంతో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. సూర్యఘర్ సోలార్ పథకం ద్వారా ఒక్కో వినియోగదారునికి రూ.78 వేలు సబ్సిడీ అందిస్తున్నామన్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ రుణం ద్వారా ఐదారేళ్లలో తీర్చే వెసులుబాటు ఉందన్నారు. దేశవ్యాప్తంగా కోటి సోలార్ కనెక్షన్లను లక్ష్యంగా పెట్టుకుంటే, అందులో 25 లక్షల కనెక్షన్లను ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేసినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గానికి 10 వేల సోలార్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముందుగా 10, 20 మంది సోలార్ పెట్టుకుని దాని వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తేనే మిగిలిన వారు పెట్టుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో వచ్చే సోలార్ పథకాలను వినియోగించుకుంటే ప్రజలకే లాభమని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.





