సూపర్–6 గాలికొదిలేసి ‘సూపర్–4’ దోపిడీ పాలనతో..– దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో కూటమి విధానాలే..– వైసీపీ మదనపల్లి సమన్వయకర్త నిస్సార్ అహ్మద్నేటి సాక్షి, మదనపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, ఎన్నికల్లో చెప్పిన సూపర్–6 పథకాలను పూర్తిగా విస్మరించి, తన పార్టీ శ్రేణుల కోసం ‘సూపర్–4’ పథకాలను అమలు చేస్తున్నారని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ సూపర్–4 అంటే దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే విధానాలేనని ఆయన ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘కోటి సంతకాల’ సమావేశంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 18 నెలల కూటమి పాలనలో అభివృద్ధి శూన్యమని, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, మద్యం మాఫియాలే పాలనగా మారాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏదీ లేదని విమర్శించారు. ప్రజా పాలనను పక్కనపెట్టి దోపిడీ పాలన కొనసాగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, నాలుగేళ్లు ఏదోలా గడిపేసి, ఎన్నికల సమయంలో మళ్లీ మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో జరుగుతున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు చేపడతామని, వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా కార్పొరేట్ విధానంలో భారీగా నగదు చేతులు మారి ఇది క్విడ్ ప్రో క్వోగా మారిందని నిస్సార్ అహ్మద్ ఆరోపించారు. పీపీపీ విధానంపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఇవి ప్రజలు కూడా గుర్తిస్తున్నారని అన్నారు. పేదలకు విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన మెడికల్ కాలేజీల వల్ల ఆయనకు మంచి పేరు వస్తుందన్న భయంతోనే చంద్రబాబు ప్రైవేటీకరణకు పూనుకుంటున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని నిస్సార్ అహ్మద్ పిలుపునిచ్చారు..





