నేటి సాక్షి తిరుపతి * (బాదూరు బాల) తిరుపతి, డిసెంబర్ 20 : అంతరించిపోతున్న ఆదివాసి కళలను ఆదరించి భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా బంజారా జన్ సంఘ్ పనిచేస్తుందని మాజీ మంత్రి పరసా రత్నం, శ్రీహథిరాంజి బావాజీ ఆలయ వ్యవస్థాపకులుఆలయ వ్యవస్థాపకులు శివ నాయక్ లు పేర్కొన్నారు.బంజారా జన్ సంఘ్ 8 వ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు శనివారం తిరుపతి గిరిజన భవన్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి మాజీ మంత్రి పరసారత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయంలో కలలకు పెట్టింది పేరు అన్నారు. బంజారా, గిరిజన తదితర ప్రాచీన సాంస్కృతిక కళలు మన సంస్కృతిలో భాగం అని అంతరించిపోతున్న ఇటువంటి కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బంజారా జన్ సంఘ్ వ్యవస్థాపకులు మూడే హరి చౌహన్ నాయక్ , గిరిజన భవన్ వ్యవస్థాపక చైర్మన్ వెంకటరమణ నాయక్ లు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి అంటే గిరిజన సంస్కృతి అని ఈ రెండిటిని విడదీయలేమని తెలిపారు. విద్యార్థులలో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి అంతరించిపోతున్న కళ లను కాపాడేందుకు విద్యార్థులకు అనుసంధానం చేస్తూ వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్నామని తెలిపారు. వందమంది విద్యార్థులకు 1000 రూపాయలు చొప్పున ప్రతిభా పురస్కారాలను, మెమెంటో ప్రశంస పత్రాలను, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయ కళలను నేటితరం విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బంజారా జన సంఘ్ మరింతగా కళలను కళాకారులను ఆదరించి ఆదుకునేందుకు ప్రభుత్వాలు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆదివారం గిరిజన, దింసా నృత్యాలు జరుగుతుందని తెలిపారు. కాగా శనివారం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం గిరిజన దింసా నృత్యం తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది నాగపట్ల రాజగోపాల్, డివిఎంసి మెంబర్ వెంకటేష్ నాయక్ భారతీయ యువజన సంఘం వ్యవస్థాపకులు వినోద్ రాథోడ్ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ బాబు, బంజారా జన్ సంఘ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లాస్య, తిరుపతి జిల్లా అధ్యక్షులు సౌందర్య నాయక్,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రియాంక నాయక్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





