నేటి సాక్షి, ధర్మారం (జనవరి 19) : పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.*మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి ధర్మారం మండలంలో పర్యటించి ఎంపీడీవో కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు*.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… దొంగతుర్తి గ్రామానికి 11 వేల భక్తులు, బోట్ల వనపర్తి గ్రామానికి 9 వేల మంది భక్తులు, నంది మేడారం కు 6 వేల మంది భక్తులు, ధర్మారం కు 5 వేల మంది భక్తులు, కటికనపల్లి కు 10 వేల మంది భక్తులు, కొత్తూరు కు 6 వేల మంది భక్తులు, ఎర్రగుంటపల్లి కు 8 వేల మంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతర కోసం వస్తారని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అంచనాలు తయారు చేయడం జరిగిందని తెలిపారు. ధర్మారం మండలంలో వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన సంక్షేమ శాఖ నుంచి 272 కోట్ల రూపాయలు కేటాయించి మేడారంలో శాశ్వత నిర్మాణాలు చేశారని తెలిపారు. మేడారంలో క్యాబినెట్ సమావేశాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించిందని అన్నారు. ధర్మారం మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర జరిగే గ్రామాలకు 4 పంచాయతీ కార్యదర్శులను ఇంచార్జి గా నియమించడం జరిగిందని అన్నారు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతరకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని అన్నారు.జాతర సందర్భంగా గ్రామాలలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, అక్కడ ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే సంబంధిత మండల పంచాయతీ అధికారి దృష్టికి తీసుకుని రావాలని, గ్రామాలలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద గద్దల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎస్.డి.ఎఫ్ నుంచి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. జాతర నిర్వహణకు సంబంధించి అవసరమైన విద్యుత్ పోల్స్ ఏర్పాటుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని, 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరకు మండలం లోని ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని, స్థానిక ప్రజా ప్రతినిధులు, జాతర నిర్వహణ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ అధికారులు అవసరం ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ… ధర్మారం మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్ల కట్టుదిట్టంగా పూర్తి చేయాలని అన్నారు. జాతరకు తక్కువ సమయం ఉన్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలని, దీనికి తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు మంత్రి ధర్మారం మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి సందర్శించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, తహసిల్దార్ డి. శ్రీనివాస్, ఎంపీడీవో వేముల సుమలత , సంబంధించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

