నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో జరుగుతున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ మున్సిపాలిటీలలోని పోలింగ్ కేంద్రాల పరిస్థితిని సమీక్షించారు.*పోలింగ్ సరళిపై నిశిత పర్యవేక్షణ*వివిధ మున్సిపాలిటీలలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతున్న తీరును, కేంద్రాల లోపల ఏర్పాట్లను, బయట ఓటర్ల రద్దీని సమగ్రంగా పరిశీలించారు. పోలింగ్ శాంతియుతంగా, పారదర్శకంగా కొనసాగుతున్నదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. అలాగే పోలింగ్ పురోగతిపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.___

