నేటి సాక్షి గజ్వేల్…. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్కు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు.ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా” ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు.మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

