నేటి సాక్షి గజ్వేల్ :—- రాష్ట్ర రాజకీయాల్లో వందేమాతరం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో వందేమాతరం గేయం ఆలపిస్తున్న సమయంలో కొన్ని సభ్యులు వాకౌట్ చేసిన ఘటనపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు.ఈ నేపథ్యంలో గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టి, దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అసెంబ్లీలో వందేమాతరం గేయం సమయంలో వాకౌట్ చేయడం దేశానికి, రాజ్యాంగానికి అవమానమని ఆరోపించారు. అలాంటి చర్యలకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే రాష్ట్రంలో హిందూ సాంప్రదాయాలు, ఆలయాలపై జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీతో కలిసి పనిచేస్తూ పాక్షిక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు.ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





