- తిప్పారపు శ్రీనివాస్ సిపిఎం మండల కార్యదర్శి
నేటి సాక్షి, బెజ్జంకి: భవన నిర్మాణ కార్మికుల మాదిరిగా హమాలీ కార్మికులకు కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో సీపీఎం పార్టీ శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు లేకపోవడం వల్ల హమాలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు జరిగినప్పుడు వారికి నష్టపరిహారం అందడం లేదని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు అమలులోకి వస్తే, కార్మికుల 8 గంటల పని, కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు హరించుకుపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ గుర్తింపు కార్డులు కల్పించి, అన్ని విధాల సహకారం అందించాలని, 55 సంవత్సరాలు నిండిన హమాలీలకు నెలకు రూ.6,000 పెన్షన్ ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇల్లు లేని నిరుపేద హమాలీలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం హమాలీ కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయకపోతే, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి సంఘ ఎల్లయ్య, బొమ్మిడి సాయికృష్ణ, కుంట సత్తయ్య, గాజె రాజు, గాజె లక్ష్మణ్, ఇంగె నర్సింగం, తాటి చెట్టు రాజమల్లు, నిషాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




