- ఆకాశవాణి ప్రోగ్రాం హెడ్ ఇల్లందుల రవికుమార్

నేటి సాక్షి-హనుమకొండ: రైతన్నకు అండగా ఆకాశవాణి ఉంటుందని ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమ నిర్వహణ అధికారి, ప్రోగ్రాం హెడ్ ఇల్లందుల రవికుమార్ అన్నారు. రేడియో కిసాన్ దినోత్సవం పురస్కరించుకొని ఆకాశవాణి వరంగల్ కేంద్రంలో శనివారం ఉదయం ఆదర్శ రైతుల సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి కే. అనురాధ, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ దిలీప్, మున్సిపల్ శాఖ చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్, వ్యవసాయ శాఖ సాంకేతిక అధికారి కమలాకర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం హెడ్ ఇల్లందుల రవికుమార్ మాట్లాడుతూ… ఆకాశవాణిలో రైతు సోదరుల కోసం ఉద్దేశించిన కిసాన్ వాణి కార్యక్రమాలు ప్రారంభమైన రోజుని కిసాన్ దినోత్సవం గా పరిగణిస్తూ,ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన రేడియో కిసాన్ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి అభ్యుదయ రైతులలో కొందరిని ఎంపిక చేసి, పదిమంది ఉత్తమ వ్యవసాయదారులుగా గుర్తించి, ఘనంగా సత్కరించమని తెలిపారు. వీరిలో మహిళా రైతుల కూడా ఉండటం విశేషం అన్నారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ మాట్లాడుతూ తాము క్షేత్ర పర్యటనలకు వెళ్ళినప్పుడు లభిస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకొని అనేకమంది రైతు సోదరులు రేడియో వల్ల ప్రయోజనం పొందుతున్నారని తెలియజేశారు. గ్రామాలలో చాలామంది వ్యవసాయదారులు రేడియోని కుటుంబ సభ్యులలో భాగంగా పరిగణించటం ఆవిడ గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని ప్రతి ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేసినా కొత్త వంగడాల వివరాలని, వ్యవసాయంలో అనుసరించాల్సిన మెలకువలని చేరవేయడంలో ఆకాశవాణి సంపూర్ణంగా తమ పాత్ర నిర్వహిస్తున్నదనీ పేర్కొన్నారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ దిలీప్ మాట్లాడుతూ… ఎన్ని చైతన్య యాత్రలు ఎవరు నిర్వహించిన వ్యవసాయం కోసం ఆకాశవాణి నిర్వహించే పాత్ర ఉన్నతమైనదని అన్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలతో ఆకాశవాణి కి గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మునిసిపల్ శాఖ ముఖ్య ఉద్యాన శాఖ అధికారి రమేష్ వ్యవసాయం అనేది ఒక తృప్తితో కూడిన కళాత్మకమైన జీవన విధానం అని అభి వర్ణించారు. మార్పును స్వీకరిస్తేనే మనుగడ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా రైతు సోదరులకు సూచించారు. హరిత విప్లవ ప్రయోజనాలని రైతు సోదరులకు చేరవేయడంలో ఆకాశవాణి పాత్ర గణనీయమైనదని అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ సాంకేతిక అధికారి కమలాకర్ ఒక సినిమా పాటను ఉదహరించి సభను రంజింప చేశారు.రైతు సోదరులు వివిధ పంటలు సాగు చేసే సమయంలో ఏఏ దశలలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సమాచారాన్ని చేరవేయడంలో ఆకాశవాణి సమర్థవంతంగా కృషి చేస్తున్నదని అన్నారు. తన బాల్యంలో గ్రామపంచాయతీ రేడియో నిర్వహించిన పాత్రని గుర్తు చేసుకున్నారు. ఈ సభలో పలువురు రైతు సోదరులు అడిగిన సందేహాలకు జిల్లా అధికారులు తగిన సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కిసాన్ వాణి విభాగం అధికారి బొంపల్లి నరేష్ కుమార్ తొలి పలుకు లతో ప్రారంభం కాగా, విద్యా వినోదం వ్యవసాయం సమపాళ్ళుగా అందించిన ఆకాశవాణి ఎప్పుడూ కూడా వ్యవసాయ కార్యక్రమాల కోసం తొలి ప్రాముఖ్యతనిస్తుందన్నారు. అడవి రాజబాబు కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించారు. కిసాన్ వాణి కార్యక్రమాలను సమర్పించే వ్యాఖ్యాతలు డాక్టర్ పసుల ఎల్లయ్య, డాక్టర్ మోటె చిరంజీవి, ఆర్షం సదానందం, పంకజ్ మోహన్ లను సత్కరించారు. ఈ కార్యక్రమానికి యాద ఉషశ్రీ వందన సమర్పణచేశారు.ఈ రేడియో కిసాన్ దినోత్సవ వేడుకలో ఆకాశవాణి సిబ్బంది శివశంకర్, శ్రీనివాసాచార్య, వెంకటరమణ, శ్రీనివాసరాజు, ఉషశ్రీ, రామమూర్తి, విజయలక్ష్మి, రామ మోహన్, చందు, స్వప్న, రమేష్, మొగిలి,సుధాకర్, అశోక్, ఎలిషా, సరిత, అనిల్ ప్రసాద్, పరాంకుశం శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.





