- రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- రాష్ట్ర విద్యారంగ అభివృద్ధిలో భాగంగా ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. బుధవారం సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు కొరకు స్థల సేకరణపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించి, సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, అభిలాష అభినవ్, ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ఉట్నూర్ అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, దీపక్ తివారి, ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్ అభిగ్యన్ మొహియ లతో కలిసి విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ, తెలంగాణ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (సమీకృత గురుకుల పాఠశాల) లను రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాలలో నిర్మించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో సమీకృత గురుకుల పాఠశాలకు అవసరమైన స్థలాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా సిసి కెమెరాలు, ప్రాక్టికల్, థియరీ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కళాశాలలకు విద్యార్థుల హాజరు శాతం, స్లిప్ టెస్టులు, అడ్మిషన్ల ప్రక్రియ ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయిన ప్రాంతంలో అవసరమైన అనుమతులు, సంబంధిత పనులను వేగవంతం చేయాలని, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాలు అనువుగా ఉన్నాయా, లేదా పరిశీలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





