Saturday, March 21, 2026

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి

  • మార్చి 17 నుండి 31 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలు
  • జిల్లాలో 593 కేంద్రాల్లో హాజరు కానున్న 28656 మంది విద్యార్ధులు
  • ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలి.
  • పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలి..
  • జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి: జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని, ఎక్కడ కూడా మాస్ కాపింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై స్ధానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, డి ఆర్ ఓ నరసింహులు, డి ఈ ఓ కె వి ఎన్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ప్రభాకర్ రెడ్డి, సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భoగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మార్చి 17 నుండి 31 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్షా పత్రాలు భధ్రపర్చే కేంద్రంలో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి 17 నుండి 31 వరకు 10 వ తరగతి రెగ్యులర్ వారికీ , 17 నుండి మార్చ్ 28 వరకు ఓపెన్ స్కూల్స్ విద్యార్ధులకు 10 వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లాలో 164 కేంద్రాల్లో 28656 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని తెలిపారు. ఓపెన్ స్కూల్స్ పదవ తరగతి చదువుతున్న 1019 మంది విద్యార్ధులకు గానూ 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయమని తెలిపారు.ఓపెన్ స్కూల్స్ పదవ తరగతి పరీక్షలు మార్చి 17 వ తేది నుండి 28 వ తేది వరకు, ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి అని అన్నారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ మార్చ్ 3 వ తేది నుండి 15 వ తేది వరకు ఉదయం 9 గంటల నుండిమధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఇంటర్మీడియట్ చదువుతున్న 2838 విద్యార్థులకు గాను14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో అవసరమగు బస్సులను నడపాలని, సంబంధిత సమయాలను ముందుగా పత్రికా ముఖంగా తెలియజేయాలని ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలు కట్టుదిట్టంగా, ఎక్కడా కాపీ జరగకుండా నిర్వహించాలని తెలిపారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ను, డిపార్ట్మెంటల్ అధికారిని నియమించాలని, 6 ఫ్లయింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేయాలనీ సూచించారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జెరాక్స్ కేంద్రాలను, నెట్ సెంటర్లను మూసి వేయాలని తెలిపారు. 10 రూట్ లను ఏర్పాటు చేసి రూట్ ఆఫీసర్లును నియమించాలన్నారు. పరీక్షా కేంద్రాలతోపాటు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులకు, తాగు నీరు, పారిశుధ్యం ఏర్పాటు చేయాలనీ మున్సిపల్ కమీషనర్లకు, డి.పి.ఓ కు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద, స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద మెడికల్ క్యాంపు లను నిర్వహించి అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని డి.ఎం.హెచ్.ఓ కు సూచించారు. ఈ సమావేశం లో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ గురుస్వామి రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్, డిప్యూటీ ఈవో బాలాజీ, జిల్లా రవాణా శాఖ అధికారి మురళీ మోహన్, డి పి ఓ సుశీలాదేవి, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు, పోస్టల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News