- జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికలలో భాగంగా ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగనున్న పోలింగ్ కొరకు బ్యాలెట్ బాక్స్ లు, ఎన్నికల సామాగ్రి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు, హరికృష్ణలతో కలిసి బ్యాలెట్ బాక్స్ లు, సామాగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 27న జరుగనున్న శాసనమండలి సభ్యుల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కొరకు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, పట్టభద్రుల ఎన్నికల కొరకు 48 జంబో బ్యాలెట్ బాక్స్ లు కేటాయించగా అందులో 8 అదనపు బాక్స్ లు, 48 స్మాల్ బ్యాలెట్ బాక్స్ లు కేటాయించగా అందులో 8 అదనపు బాక్స్ లు, ఉపాధ్యాయుల ఎన్నికల కొరకు 44 స్మాల్ బ్యాలెట్ బాక్స్ లు కేటాయించగా అందులో 8 అదనపు బాక్స్ లను కేటాయించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 40 పట్టభద్రులు, 18 ఉపాధ్యాయ ఎన్నికల కొరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు ర్యాండమైజేషన్ ప్రక్రియలో కేటాయించిన ప్రకారంగా బ్యాలెట్ బాక్స్ లు, ఇతర సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని, భద్రతా చర్యల మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజేశ్వర్, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




