- కలెక్టరేట్ సూపరిడెంట్ సంతోష్ కు వినతి పత్రం
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– మహిళ రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ఉప కోట ప్రకటించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ సూపరిడెంట్ సంతోష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ, దేశ జనాభాలో 60 శాతం బీసీ జనాభా ఉంటే అందులో సగం బీసీ మహిళలే అయినప్పటికీ మహిళలకు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు సముచిత స్థానం దక్కిన దాఖలాలు లేవని అన్నారు. 76 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ 33 శాతం మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామని చెప్తుందని, అందులో బీసీ మహిళలకు 18 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళలకు ఉప కోట ప్రకటించకుండా, మహిళ రిజర్వేషన్ బిల్లు పెడితే అది కేవలం అగ్రకులాల మహిళ బిల్లుగా భావించవలసి వస్తుందని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం మహిళ రిజర్వేషన్ బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళ సమాజం ముందు బిజెపి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, శాఖపూరి భీమ్సేన్, అంకం సతీష్, పంపరి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.



