- నిజమైన ప్రజానాయకుడిని అణచివేయాలన్న ప్రయత్నం వెనుక రాజకీయ శక్తుల కుట్ర?
నేటి సాక్షి, కరీంనగర్ ప్రతినిధి: ‘జిల్లా కాంగ్రెస్ సంస్థాగత సమావేశం అట్టుడికిపోయింది. వేదికపైనే నేతల మధ్య తోపులాట చోటుచేసుకోవడం.. సమావేశం అర్ధాంతరంగా నిలిపివేయడం వంటి పరిణామాలకు కారణమైనది’ అని కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ సూటి వ్యాఖ్యలు చేశారు. కానీ, ఈ పరిణామాల వెనుక నడుస్తున్నది కేవలం అనుకోని ఉద్రిక్తత కాదు.. ఒక పక్కా రాజకీయ కుట్ర అని కార్యకర్తలు పేర్కొంటున్నారు.
నిజాయితీపై మూలుగుతున్న కుట్రలు!
సమావేశంలో పురుమల్ల శ్రీనివాస్ గళమెత్తి, పార్టీకి అంకితమైన నిజమైన కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం, నామినేటెడ్ పదవుల్లో న్యాయం లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రతిపాదించిన అభ్యర్థులను గుర్తించకుండా హైదరాబాద్లో ఒక ప్రముఖ నేత అడ్డుపడ్డాడని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో, కొన్ని రాజకీయ శక్తులు ఆయన మాటలను వికృతీకరించి వేదికపైనే ఘర్షణను ప్రేరేపించాయి.
– “పురుమల్లది తప్పేనా?”.. కార్యకర్తల ప్రశ్న
స్థానిక రాజకీయ విశ్లేషకుల మాటల్లో.. పురుమల్ల శ్రీనివాస్పై జరుగుతున్న విమర్శలు స్వచ్ఛమైన రాజకీయ పోరాటాన్ని అణచివేయాలన్న కుట్రాశయమే. గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్పై మాట్లాడిన సందర్భంలోనూ ఇదే తరహా అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, పురుమల్ల నిజాయితీ గెలిచింది. ఇప్పుడు కూడా అదే చరిత్ర పునరావృతం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజల నమ్మకానికి ప్రతీక పురుమల్ల
కరీంనగర్ రాజకీయాల్లో గంగుల కమలాకర్ లాంటి శక్తిమంత నేతకు ధీటుగా నిలబడి ప్రజల మద్దతును సంపాదించిన అరుదైన నాయకుడు పురుమల్ల శ్రీనివాస్. ప్రజల నాడిని తెలుసుకుని, కార్యకర్తల బాధలను ముడిపెడుతున్న నాయకుడిగా ఆయన కాంగ్రెస్ కార్యకర్తల్లో ప్రగాఢ విశ్వాసం పెంచారు.
– కాంగ్రెస్ హైకమాండ్ సందేశం ఇది..
“నిజమైన కార్యకర్తల గొంతును వినండి. రాజకీయ కుట్రలను గుర్తించి, నిబద్ధత గల నాయకులకు పూర్తి మద్దతు ఇవ్వండి.. కేవలం పదవుల కోసమే రాజకీయాలు చేసే వారిని కాదు.. ప్రజల కోసం నిజంగా పోరాడే వారిని నిలబెట్టండి.” అని హైకమాండ్స్పష్టం చేస్తున్నది. కరీంనగర్ కాంగ్రెస్కు పురుమల్ల శ్రీనివాస్ లాంటి నాయకుడు అవసరం. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకుడిని రాజకీయ కుట్రలతో నలిపే ప్రయత్నం పార్టీ భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతుందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.





