- సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్
- ఏరియా సివిల్ కాంట్రాక్ట్ కార్మికుల నూతన ఫిట్ కమిటీ ఎన్నిక
నేటి సాక్షి, మందమర్రి:- కనీస వేతనాల పెరుగుదలకై కాంట్రాక్ట్ కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో నిర్వహించిన ఏరియా సివిల్ కాంట్రాక్ట్ కార్మికుల సర్వ సభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల విధానాలతో కనీస వేతనాల జీవోలను సవరించకుండా కాంట్రాక్ట్, కార్మికుల వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో కార్మిక వర్గం శ్రమ దోపిడీకి గురవుతు, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లేక, కొనుగోలు శక్తిలేక కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలోకి కార్మిక వర్గం వెళ్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాంట్రాక్ట్ కార్మికులంతా ఏకమై ఐక్య పోరాటాలతో కనీస వేతనాల పెంపుదల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సివిల్ కాంట్రాక్ట్ కార్మికుల నూతన పిట్ కమిటీ ఎన్నుకున్నారు. పిట్ కమిటీ అధ్యక్షుడిగా అల్లంల వెంకటేష్ కార్యదర్శిగా ఎండి ఇమామ్, ఉపాధ్యక్షులుగా జంగంపల్లి సతీష్, ఈ శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా బి సదానందం, ఎం శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా ఎం శివకుమార్, ప్రచార కార్యదర్శిగా ఎం తిరుపతి కమిటీ సభ్యులుగా ఈ సారయ్య, ఏ రాజయ్య, కే సందీప్, ఆర్ బాలరాజు, ఎస్ రమేష్, ఆర్ శ్రీనివాస్, కే సాగర్, కే రంజిత్, టి రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రాజేంద్ర ప్రసాద్, యూనియన్ నాయకులు కుమార్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.




