నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి తెలిపారు. మంగళవారం నస్పూర్ లోని జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం ముందు అంగన్వాడి లు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థల అధిపతులపై ఉన్న ప్రేమ కనీసం పేదలకు సేవలందిస్తున్న ఐసిడిఎస్, అంగన్వాడి పై లేకపోవడం శోచనీయమన్నారు. కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల వద్ద తీసుకున్న 16 లక్షల కోట్ల రూపాయల రుణాలు రద్దు చేయడం, మరోపక్క కేంద్రంలో ఐసిడిఎస్ కు నిధులు తగ్గించడం దుర్మార్గమని తెలిపారు. దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది పేదలకు సేవలందిస్తున్న ఐసిడిఎస్ సంస్థను నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే జాతీయ నూతన విద్యా విధానం, రోజుకో కొత్త యాప్ లు తీసుకువచ్చిందని ఆరోపించారు. మోడీ బాటలోనే పయనిస్తున్న రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. లక్షలాది రూపాయల వేతనాలు, అలవెన్స్ తీసుకుంటున్న ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు వారు చేస్తున్న పని వివరాలు, ప్రజలకు సేవలు అందిస్తున్నారా, లేదా అనే వివరాలు తెలియజేయడం కోసం వారి చుట్టూ సీసీ కెమెరాలు, ఫోన్ యాప్ లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుమాస అశోక్, దూలం శ్రీనివాస్, సిఐటియు నాయకులు దుంపల రంజిత్ కుమార్, జి ప్రకాష్, చల్లూరి దేవదాసు, ఎం బ్రహ్మయ్య, పాయిరాల రాములు, అంగన్వాడి యూనియన్ నాయకులు పాల్గొన్నారు.





