- ఎమ్మెల్యేను విమర్శిస్తే గుడ్డలు ఊడదీసి కొడతాం
- మాజీ ఎమ్మెల్యేను విమర్శించిన కాంగ్రెస్ నాయకులు
నేటి సాక్షి, రామడుగు (పురాణం సంపత్) : అభివృద్ధి అంటే ప్యాలెస్ కట్టుకోవడం కాదు నియోజకవర్గ అభివృద్ధి అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలుసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం రామడుగు మండలం మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నర్సింగ్ బాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బుచ్చయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే రవిశంకర్కు మాట్లాడే అర్హత లేదని అన్నారు. అలాగే ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సొంత అభివృద్ధి కే ప్రాధాన్యత ఇచ్చాడని బూరుగుపల్లి గ్రామంలో ప్యాలెస్ లాంటి ఇంటిని నిర్మించుకున్నాడని అభివృద్ధి అంటే సొంత అభివృద్ధి కాదని నియోజకవర్గం అభివృద్ధి అన్న సంగతి ఆయన గుర్తుంచుకోవాలని హితువు పలికారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇవ్వడానికి లక్షలాది రూపాయలు లంచం తీసుకున్న చరిత్ర రవిశంకర్ ది అని ఆరోపించారు. చొప్పదండి నియోజకవర్గం లో సీఐ ఎస్ఐ తాసిల్దార్ లాంటి పోస్టుల కోసం అధికారులను పీడించి లక్షలాది రూపాయలను వసూలు చేసిన ఘనుడు రవిశంకర్ అని ఎద్దేవ చేశారు. అలాగే దళిత బంధు పథకంలో ఆర్థిక సహాయాన్ని అర్హులకు అందకుండా చేసి మధ్యవర్తుల ద్వారా కమిషన్లు వసూలు చేసి అనర్హులకు కట్టబెట్టిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యేనే అని అన్నారు. చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమును విమర్శిస్తే గుడ్డలు ఊడదీసి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.





