నేటిసాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామానికి చెందిన రైతులు సాగు చేస్తున్న వరి పంట పొలాలను పరిశీలించిన జిల్లా ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్), కరీంనగర్ శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి రైతులకు తగు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న వరి పంటలో కాండం తొలిచే పురుగు ఆశిస్తుందని తెలియజేశారు. యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నది అలాగే అగ్గి తెగులు లక్షణాలను కూడా గమనించడం అయినది. వరి పంటలో ఆశించే కాండం తొలిచే పురుగు నివారణకు 60 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ మందుని లేదా 400 గ్రాముల కార్టప్ హైడ్రో క్లోరైడ్ మందుని లేదా 120 మి.లీ. ఐసోసైక్లోసీరమ్ మందుని ఒక ఎకరా పొలానికి పిచికారి చేయాలి. బురద పదునులో వేయాలి. అలాగే అగ్గి తెగులు సోకిన పంట పొలాల్లో తాత్కాలికంగా యూరియా వేయడం ఆపివేయాలి. తరువాత ఈ తెగులు నివారణకు ఐసోప్రోతయోలిన్ 1.5 మి. లీ. లేదా టేబుకోనజోల్+ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.4 గ్రాముల మందిని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆ తరువాత ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుల పొలాన్ని సందర్శించి నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం గురించి వివరించడం జరిగింది. ఈ క్షేత్ర సందర్శనలో జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా.కె.మదన్ మోహన్ రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ. రాజేష్ మరియు అభ్యుదయ రైతులు శ్రీ. రామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఇతర రైతులతో పాటు, రావిప్ విద్యార్థినిలు పాల్గొన్నారు.




