నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్) : మండల కేంద్రంలోని ఆయుష్ ఆసుపత్రిని సోమవారం ఆయుష్ శాఖ జిల్లా ఇన్చార్జి అధికారి యస్రబ్ సుల్తానా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో గల వసతులను పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. గతంలో ఉన్న ఆయుష్ భవనాన్ని పోలీస్ స్టేషన్ కేటాయించడంతో పాత రేకుల షెడ్డును గ్రామ పంచాయతీ భవనాన్ని ఆసుపత్రికి కేటాయించారని, అరకొర వసతుల మధ్య సిబ్బంది విధులు నిర్వహించవలసి వస్తుందని తెలిపారు. నీటి వసతి,మరుగుదొడ్ల సదుపాయం లేదని ఇప్పటివరకు ఐదు సందర్భాల్లో ఈ ఆయుష్ కేంద్రాన్ని సందర్శించడం జరిగిందన్నారు. కానీ మెరుగైన వసతులు కల్పించడం లేదని తిరిగి పాత భవనాన్ని కేటాయించాలని కోరారు. ఆ పాత భవనంలో యోగా నిర్వాహనకు నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా పోలీస్ స్టేషన్ వేరే భవనంలోకి మార్చి ఆయుష్ ఆస్పత్రికి అప్పగించితే వృద్ధులకు, మహిళలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఆసుపత్రిలో ఫార్మసిస్టు డాక్టరు ఉండడానికి అనుకూలంగా ఉండే పోలీస్ స్టేషన్ భవనాన్ని తిరిగి ఆయుష్ కు అప్పగించాలని కోరారు. అలాగే ఇప్పటివరకు ఖాళీగా ఉన్న వైద్య అధికారి పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. తనతో పాటు వైద్య సిబ్బంది ఉన్నారు.



