- గైర్హాజరు కార్మికులు సక్రమంగా విధులకు హాజరు కావాలి
- కాసీపేట 1గని మేనేజర్ భూశంకరయ్య
నేటి సాక్షి, మందమర్రి:– సింగరేణి గైర్హాజరు ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకావాలని, నాగాల పేరిట ఉద్యోగాలు కోల్పోవద్దని ఏరియాలోని కాసీపేట 1 గని మేనేజర్ భూశంకరయ్య సూచించారు. శుక్రవారం ఏరియాలోని కాసీపేట 1 గని పై గైర్హాజరు కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి నెలలో అండర్ గ్రౌండ్ లో 16 కన్నా తక్కువ మస్టర్లు, సర్ఫేస్ ఉద్యోగులు 20 మస్టర్ల కన్న తక్కువ మస్టర్లు చేసిన వారికి, అదే విధంగా 2024 సంవత్సరంలో 100 మాస్టర్ల కన్నా తక్కువ చేసిన సుమారు 40 మంది ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గని మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ… ఏ సంస్థలో లేని విధంగా సింగరేణిలో మంచి వేతనాలు ఉన్నాయన్నారు. కార్మికులు విధుల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉంటే, వాటిని తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా ఇతరులకు చెప్పడంతో సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుందని తెలిపారు. తరచూ విధులకు గైర్హాజరయ్యి, తగినన్ని మాస్టర్లు లేక, డిస్మిస్ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని వివరించారు. దీనితో డిస్మిస్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, దీన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అనారోగ్యంతో పాటు ప్రమాదాల బారిన పడి గాయాలు మానిన ఒళ్ళు నొప్పులు ఉన్నటువంటి కార్మికులు వారి పరిస్థితిని తనతో పాటు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తే కొద్ది రోజులు సర్ఫేస్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పని లేకుండా విధులకు గైర్హాజరవుతూ, అటు వారి కుటుంబాలకు, ఇటు సింగరేణికి భారం కావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో గని డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్వర్, గని పిట్ కార్యదర్శి మీనుగు లక్ష్మీనారాయణ లు పాల్గొన్నారు.





