నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): వరంగల్ దగ్గర మడికొండలో నిర్మించనున్న డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను మడికొండ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించే సరికి అక్కడి డంపింగ్ యార్డ్ ను ప్రభుత్వ అధికారులు చాకచక్యంగా హుజురాబాద్ లో ఏర్పాటు చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థలాన్ని కూడా పరిశీలించారు. దీని వల్ల హుజురాబాద్ మరియు చుట్టూ ఉన్న పది గ్రామాల ప్రజలకు తీవ్రమైన విఘాతం కలుగుతుంది. వ్యవసాయక ప్రాంతమైన హుజురాబాద్ మండలం లో భూసారం, భూగర్భ జలాలు, వాతావరణం కాలుష్యం చెంది వ్యవసాయ పంటలు పండే అవకాశం కోల్పోతుంది. ప్రజలకు తీవ్రమైన అనారోగ్యం, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, అలర్జీ వంటి సమస్యలు ఏర్పడతాయి. కావున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచనను అధికారులు వెంటనే విరమించుకోవాలని హుజూరాబాద్ విద్యానగర్ కు చెందిన సీనియర్ సిటిజన్, రిటైర్డ్ పోస్ట్మాస్టర్ తాడూరి రామస్వామి మరియు ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, పాక సతీష్,వేల్పుల ప్రభాకర్, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, మార్త రవీందర్, తునికి సమ్మయ్య, సందెల వెంకన్న, ఇమ్మడి దయాకర్, రామ్ రాజేశ్వర్, మరియు హుజురాబాద్ మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




