- మహరాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు
నేటిసాక్షి, రాయికల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ యువతకు వృత్తి, విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రాల ద్వారా ఉపాధి ఆవకాశాలను కల్పించే ఏర్పాట్లు చేయాలని మహరాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు కోరారు. రాయికల్ మండలంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్టు భవనంలో ప్రతిమ ఫౌండేషన్ సహాకారంతో జిఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఉపాధి కోర్సులు అయిన హోమ్ ఎయిడ్ హెల్త్ నర్సింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, టైలరింగ్,బ్యూటిషన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతి,యువకులకు తన చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి మండలంలో నిరుద్యోగ యువత కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఇందుకు కార్పొరేట్ సంస్థలు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వచ్చి ఎంతోమంది పేద యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో నైపుణ్యతను పెంచాలని సూచించారు. ఫలితంగా గ్రామీణ యువత ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారని చెప్పారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని అన్నారు. మండలంలోని గిరిజన గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతీ,యువకులు నైపుణ్య కేంద్రాలు కల్పించే శిక్షణను అందిపుచ్చుకొని అభివృద్ధిని సాధించాలని భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలను ఈ శిక్షణ కేంద్రానికి కల్పిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ప్రోగ్రాం అధికారి మొయ్య మహేష్, ప్రతిమ ఫౌండేషన్ మార్కెటింగ్ మేనేజర్ కౌశిక్, ఫౌండేషన్ మేనేజర్ వంగ గీతారెడ్డి, చిన్న జీయర్ ట్రస్ట్ ఇన్చార్జి ఏఎం రాజు రెడ్డి, ఫౌండేషన్ ప్రతినిధులు రాజారెడ్డి, రఘుపతి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.



