
నేటి సాక్షి, పెద్దపల్లి:
అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కార్యాచరణ అమలు చేయాలని
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం మంథనిలోని లక్ష్మీభారతి ఫంక్షన్ హాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై మంథని నియోజకవర్గస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయబోతున్న 4 నూతన పథకాలకు అర్హులైన లబ్ధిదారులను, అనర్హులను ఎంపిక చేసి గ్రామ సభ ల ద్వారా ఆ జాబితాను ఆమోదింప చేసుకోవాలని అన్నారు. గ్రామ సభల ద్వారా ఆమోదింపచేసుకున్న జాబితా జనవరి 25 లోపు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి మండలంలోని తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్లు, మైనింగ్, సంబంధిత అధికారులు సంయుక్తంగా పని చేసి పట్టా దార్ పాస్ పుస్తకాల డేటా, గూగల్ మ్యాప్, రెవెన్యూ మ్యాప్ వారీగా పరిశీలిస్తూ భూ భారతి (ధరణి) నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్దిదారులను తొలగించాలని అన్నారు. జిల్లాలో 20 రోజులు ఉపాధి హామీ కూలీలుగా పని చేసిన కార్మికుల జాబితాను తీసుకొని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం పరిశీలిస్తూ భూమిలేని కుటుంబాలను ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామ సభలో ఎంపిక చేసిన జాబితా పై ఏవైనా అభ్యంతరాలు వస్తే సంబంధిత ఎంపిడీఓ 10 రోజుల్లో పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాజిక ఆర్థిక సర్వే కింద మన పెద్దపల్లి జిల్లాలో తేలిన ఆహార భద్రత కార్డులు లేని కుటుంబాలకు మండలాలలో ఎంపీడీవోలు, పట్టణాలలో మున్సిపల్ కమిషనర్లు నూతన రేషన్ కార్డుల జారీ పర్యవేక్షించాలని అన్నారు. జనవరి 23 లోపు గ్రామ సభల నిర్వహణ పూర్తి చేయాలని, గ్రామ సభ ఆమోదించిన తరువాత తుది జాబితా ఆన్ లైన్ లో జనవరి 25 సాయంత్రం లోపు నమోదు చేయాలని, జనవరి 26 నుంచి 4 పథకాల అమలును ప్రారంభించాలని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డీ వేణు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందిని, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జడ్పీ సీఈవో,జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్,తదితరులు పాల్గొన్నారు





