- వైభవంగా రాజేశ్వరుడి రథోత్సవం
నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని అంగడిమఠం శ్రీ రాజేశ్వరస్వామి ఆలయంలో మహశివరాత్రి జాతర ఉత్సవాలు శనివారం ముగిసాయి. గత నాలుగు రోజులుగా ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాయికల్, జగిత్యాల,సారంగాపూర్, మల్లాపూర్, మేడిపెల్లి మండలాల నుండి తరలి వచ్చిన భక్తుల సమక్షంలో రాజేశుడి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఆసీనులు కావించి ఓం నమశ్శివయ నినాదాలు చేస్తూ భక్తులు రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అంగడి భువనేశ్వర్, పరమేశ్వర్, గురులింగమఠం వినయ్కుమార్, విక్రమ్ తదితరులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి, మాజీ ఎంపిటిసి మోర విజయలక్ష్మి వెంకటేష్, బాలే చంద్రశేఖర్, విండో చైర్మన్ యాదవనేని రాజలింగం తదితరులు పాల్గొన్నారు.




