Monday, March 16, 2026

వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలో రైతులు వ్యవసాయ సాగులో లబ్ధి పొందే విధంగా ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పన, ఉద్యానవన శాఖ అధికారి అనిత, జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్ లతో కలిసి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణా అధికారులు, పశువైద్య శాఖ అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, ఈ నేపథ్యంలో జిల్లాలో చేపట్టవలసిన వ్యవసాయ పనులపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. సాధారణ పంటలు మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు, కూరగాయల సాగుపై రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. పాడి రైతులు పౌల్ట్రీ, గొర్రెల పెంపకం, చేపల పెంపకం పై దృష్టి సారించాలని తెలిపారు. అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్, పండ్ల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేక అవకాశాలు కల్పిస్తుందని, వ్యవసాయ అధికారులు ప్రభుత్వ పథకాలను రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో 3 వేల ఎకరాల ఆయిల్ పామ్ తోటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలలో రైతుల లబ్ధి కొరకు రాయితీ, కూలి ధరలు, ఆయిల్ ఫామ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంశాలపై వివరించారు. 5 ఎకరాల కంటే తక్కువ భూమి విస్తీర్ణం గల రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా లాభ పడేలా వివరించాలని, ప్రతి రోజు 5 నుండి 10 మంది రైతులకు లాభదాయక మార్గాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పోడు భూములు, అటవీ భూములు, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల క్రింద వెదురు మొక్కలు నాటడం జరుగుతుందని, సెరికల్చర్, అడవి ప్రాంతాలలో వెదురు చెట్ల పెంపకంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాలానుగుణంగా పంటల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఆధార్ సీడింగ్, ఈ- కెవైసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతు సమస్యలను తెలుసుకోవాలని, పంటల సాగులో మెళకువలు, పంటలపై అడవి పందుల దాడి నియంత్రణ అంశాలపై రైతులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News