- రైతులకు 20 వేల నష్టపరిహారం ఇవ్వాలి
నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలంలో రైతుల ఎండిపోయిన పంటలను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ రైతులతో కలిసి గుండారం గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు. అనంతరం చౌడారం వద్ద రంగనాయక సాగర్ ఎస్5 కెనాల్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు.పంటలన్నీ ఎండిపోతున్నా, రైతుల పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.సాగునీళ్లు లేక రైతుల కష్టం మట్టిపాలవుతుంటే, సమస్యలు పరిష్కరించే బదులు సంబరాలు చేసుకోవటం దారుణమని దుయ్యబట్టారు.రైతు కన్నీరు పెడితే రాజ్యం నిలువదు.ఎద్దు ఏడిస్తే ఎవుసం నిలువదంటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి చేయలేదని ఆరోపించారు.రైతు భరోసా ద్వారా ఇచ్చే రూ.15,000 సహాయం కూడా రైతులకు అందడం లేదని మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా బీఆర్ఎస్ పార్టీపై కుట్రతో ప్రభుత్వం నీళ్లు విడుదల చేయడం లేదని విమర్శించారు.ఎండిన పంటలకు ఎకరాకు రూ.20,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.సాగునీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, నిలిచిపోయిన కాల్వల పనులను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి,ఎలుక దేవయ్య,బండ బాబు,సోషల్ మీడియా ఇంచార్జి ఎల శేఖర్ బాబు,కత్తి అంజయ్య,దీటి రాజు,కత్తి రాములు, పలువురు రైతులు పాల్గొన్నారు.





