- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్


నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి :
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేరొన్నారు. శుక్రవారం రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని, దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి, కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సేవలు దేశం ఎన్నటికి మరిచిపోదన్నారు..నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పని చేయడంలాంటివి మన్మోహన్ సింగ్ ను చూసి నేర్చుకోవాలన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ అని తెలిపారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా, అనంతరం పది సంవత్సరాలు ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. పేద ప్రజలకు జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా మన్మోహన్ సింగ్ మన యువతరానికి ఆదర్శం అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటుటని వారి నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకిత భావం భావితరాలకు స్ఫూర్తి దాయకం అన్నారు. వారికి యావత్ దేశం నివాళులు అర్పిస్తున్నారు. వారికి సంతాపంగా ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారని పేర్కొన్నారు. వారు రాజకీయ వేత్త కాకున్నా ఐదుసార్లు రాజ్యసభ సభ్యులుగా నియమించబడ్డారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. వారు ప్రధానిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల పైచిలుకు రైతులకు రుణమాఫీ చేసి రైతన్న ఋణము విముక్తి చేశారని తెలిపారు. ఆ మహనీయుని ఆత్మకు శాంతి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, మండల ఉప అధ్యకుడు తర్రే మనోహర్, డీసీసీ సెల్ అధ్యక్షుడు గండి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, గడ్డం మహేష్, తర్రె లింగం, ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

