- ఎ పి ఎ జి.యం.
నేటి సాక్షి,రామగిరి (కన్నూరి రాజు):
రామగుండం-3 ఏరియా, అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్లతో పాటు,నూతనంగా విధుల్లో చేరిన 18 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (జె.యం.ఈ.టి) లకు గత 12 రోజుల పాటు స్థానిక ఎం.వి.టి.సి. నందు నిర్వహించిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొప్పుల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గనిలో ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్ల పాత్ర కీలకమని, కావున వారి బాధ్యతలను తెలుసుకొని విధులు నిర్వహించాలన్నారు. గనిలో వివిధ పని ప్రదేశాలను నిర్ణీత సమయాలలో తనిఖీ చేసి ప్రమాద అవకాశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అంతేకాకుండా సహచర ఉద్యోగులకు భద్రత పట్ల సరైన అవగాహన కల్పిస్తూ,భద్రతతో కూడిన విధులు నిర్వహించేలా వారిని ప్రోత్సహించాలన్నారు. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ, ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి సూపర్ వైజర్లు కృషి చేయాలని కోరారు. ఈ శిక్షణా తరగతులలో భాగంగా మైన్స్ చట్టాలను అనుసరించి తీసుకోవాల్సిన చర్యలు, గనులలో భద్రతా పరికరాల వినియోగం, భద్రతపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ యం. రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కొలిపాక నాగేశ్వరరావు, ఇంచార్జ్ మేనేజర్ ఎ. శ్రీనివాస్, ఇన్స్ట్రక్టర్లు యం.వీరన్న,నాగెల్లి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.




