- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలోని క్యాతన్ పల్లి మున్సిపల్ పరిధిలో ఫిబ్రవరి 16వ తేదీ వరకు జరుగనున్న గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం క్యాతన్ పల్లిలోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను క్యాతన్ పల్లి మున్సిపల్ కమీషనర్ రాజు, మందమర్రి మండల తహశిల్దార్ సతీష్ కుమార్, ఆదివాసీ సంఘాల నాయకులు, జాతర కమిటీ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను అధికారులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేసే దిశగా పని చేయాలని తెలిపారు. జాతర ఏర్పాట్లు మంచిర్యాల రాజస్వ మండల అధికారి పరిధిలో జరుగుతాయని, మందమర్రి, క్యాతన్ పల్లి మున్సిపాలిటీల సంయుక్త ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. వేసవికాలం అయినందున ఎలాంటి అవాంఛనీయ అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వాహనాన్ని అందుబాటులో ఉంచి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు భోజన ఏర్పాట్లు చేయాలని, అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించాలని, అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసు శాఖ అధికారులు పర్యవేక్షించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆదివాసీ సంఘాల నాయకులు, జాతర కమిటీ ప్రతినిధులు అధికార యంత్రాంగానికి సహకరిస్తూ జాతర ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగే విధంగా సహకరించాలని తెలిపారు. అనంతరం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో 25 జట్లు పాల్గొంటున్నాయని, ప్రతి ఒక్కరు క్రీడా పాల్గొనాలని, గెలుపు, ఓటము లను సమానంగా తీసుకుంటూ స్నేహభావంతో కలిసి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులు, జాతర కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





