- వజ్రోత్సవాల సందర్భంగా లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి



నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ పాఠశాల వజ్రోత్సవాల సందర్భంగా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సాహితీ లోకంలో సుప్రసిద్ధ కవి, రచయిత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి గారి స్వగ్రామం హన్మాజిపేట. సినారె చిన్నప్పుడు చదువుకున్న ఈ బడిని.. తాను రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పుడు పునర్నిర్మించటం స్ఫూర్తి దాయకం. ఆయన ఆశయాలు, ఆలోచనలు.. అడుగుజాడలు హన్మాజిపేటను రాష్ట్రంలోనే ఉన్నతమైన ఆదర్శాలకు నిలయంగా తీర్చిదిద్దారాని, హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ రోజుతో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ శుభ సందర్భంగా హన్మాజీపేట పాఠశాల వజోత్సవ వేడుకలను నిర్వహించటం ఆనందంగా ఉందని ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్న గ్రామస్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని లేఖలో తెలియజేశారు. ఈ పాఠశాలలో చదివి మన రాష్ట్రంతో పాటు దేశ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సాధించిన వారందరికీ, వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏండ్లుగా అంకిత భావం, శ్రద్ధ, పట్టుదలతో అనేక మంది విద్యార్థులకు ఈ పాఠశాల విద్యా బుద్దులు నేర్పింది. ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకత్వాన్ని అందించిందని, ఇక్కడి ఉపాధ్యాయుల కృషి, గ్రామస్థుల సహకారానికి ఈ వత్రోత్సవ వేడుకలు అసలు సిసలైన నిదర్శనం అని లేఖలో పేర్కొన్నారు. ఈ వజ్రోత్సవ వేడుకలు మీ అందరికీ మరింత ఉత్తేజాన్ని, ప్రేరణను అందించాలని.. సమాజ నిర్మాణంలో, ఈ పాఠశాల అభివృద్ధిలో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటునన్నారు. ఈ పాఠశాల వజ్రోత్సవ వేడుకలు విజయవంతంగా జరుపుకుంటున్న మీ అందరికీ సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలో పేర్కొన్నారు.





