- నెలవంక దర్శనం
- మజీద్ లలో నెలకొన్న సందడి
- ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు
నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్దలతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం నెలవంక దర్శనంతో ఆదివారం తెల్లవారుజాము నుండి ముస్లింలు నిష్టతో ఉపవాస (రోజ) దీక్షలు చేపట్టారు. ఈ సందర్బంగా ముస్లింల సందడి మధ్య మజీద్ లు కొలహలంగా మారాయి. వేకువజాము సహర్ తో ప్రారంభమైన ఉపవాసం సూర్యాస్తమయం అయ్యాక ఇప్తార్ తో ముగుస్తుంది. సుమారు 13, 14 గంటల పాటు ఏలాంటి ఆహరం, పండ్లు, పలహారం, టీ, పానీయాలు, నీరు, చివరకు ఉమ్మి కూడా మింగకుండా కఠినంగా పాటించి, ఐదు పూటలు పవిత్ర నమాజు నిర్వహించి సాయంత్రం వేళలలో ఇప్తార్ విందుతో అనాటి ఉపవాసం ముగించి, రాత్రి సమయంలో భోజనం తీసుకుంటారు. కాగా ఇదే మాసంలో పవిత్ర దివ్య ఖురాన్ గ్రంథం ఆవతరించిందన్న విశ్వాసంతో.. సహనం, ఓపిక, దైవారాధన, దాతృత్వం మేళవించిన మాసంగా భావించి ముస్లీంలు జకాత్ పేరిటా పలు సేవా కార్యక్రమాలు, పేదలకు దాన ధర్మాలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. ఇదే తరహా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి మాసం చివరి రోజు అనంతరం పవిత్ర రంజాన్ (ఈదుల్ ఫితర్) పండుగను జరుపుకోవడం అనావాయితి. ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం ఈ మాసం వెసులుబాటు కల్పించి కార్యాలయాలు, పాఠశాలలకు సాయంత్రం నాలుగు గంటల వరకు విధులు ముగించుకునేందుకు అవకాశం కల్పించింది. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్బంగా పలువురు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా పలు నగరాల్లో సాయంత్రం వేళ హలీమ్, హర్రీస్, ప్రత్యేక వంటకాలు, మిఠాయిలతో స్టాల్స్ ఏర్పాటు చేశారు.




