- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడితో హోంమంత్రి సమావేశం
- ఉపమాక ఆలయ అభివృద్ధికి సహకరించాలి: హోంమంత్రి అనిత
- చారిత్రాత్మక ఆలయాన్ని సందర్శించాలని టీటీడీ ఛైర్మన్ కు ఆహ్వానం

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుమల శ్రీవారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు హోంమంత్రికి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి.. ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వెంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. రథసప్తమి, బ్రహ్మోత్సవాల లాగే శివరాత్రి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఉపమాక ఆలయ అభివృద్ధికి సహకరించాలి: హోంమంత్రి అనిత
శ్రీవారి దర్శనానంతరం చైర్మన్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో హోంమంత్రి అనిత సమావేశం అయ్యారు. తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటలోని చారిత్రాత్మక ఉపమాక వెంకన్నస్వామి ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని చైర్మన్ బీఆర్ నాయుడిని హోంమంత్రి అనిత కోరారు. 2017లో ఆలయాన్ని టీటీడీకి అప్పగించినా.. ఇప్పటి వరకు అభివృద్ధికి నిధులు కేటాయించలేదని హోంమంత్రి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆలయ అభివృద్ధికి నాడు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆలయం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించమని టీటీడీ ఛైర్మన్ను కోరినట్లు హోంమంత్రి తెలిపారు. ఉపమాక క్షేత్ర అభివృద్ధి కోసం గతంలో టీటీడీ ఈవో శ్యామలరావుకు కూడా హోంంత్రి వినతి పత్రం సమర్పించారు. హోంమంత్రి అనిత విజ్ఞప్తిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఉపమాక ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ను పిలిపించి అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదిక సిద్ధం చేయమని ఆదేశించారు. ఈ విషయాన్ని హోంమంత్రి అనిత మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఆగమశాస్ర్తం మేరకు ఆలయంపై నుంచి విమానాలు వెళ్లకూడదు. తరుచుగా విమానాలు వెళ్లడంపై విచారణ జరిపిస్తూన్నాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం’ అని హోంమంత్రి అనిత తెలిపారు.
ఉపమాక ఆలయాన్ని దర్శించాలని టీటీడీ చైర్మన్ ను ఆహ్వానించాం : హోంమంత్రి
రాబోయే మార్చి 10వ తేదీన ఉపమాక వెంకన్నస్వామి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ ఆలయాన్ని సందర్శించాలని కోరారు. లక్షన్నర మందికి పైగా భక్తులు ఉత్సవాలకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపమాకలో స్వామి సన్నిధిలో 20 రోజులపాటు జరిగే జాతరలో అమ్మే మసాలదినుసుల ప్రత్యేకత గురించి టీటీడీ ఛైర్మన్ కు హోంమంత్రి వివరించారు. మసాలాదినుసులు రోజువారీ ఆహారంలో వినియోగించుకోవడం వలన అనారోగ్యం దరిచేరదని స్థానిక ప్రజల నమ్మకమని పేర్కొన్నారు. ఉపమాక క్షేత్రంలో రాత్రులు శ్రీవారు అక్కడే సేదతీరుతారని ప్రశస్తిగా చెప్పుకుంటారన్నారు. దేశంలో ప్రతి రోజూ వెంకన్నస్వామిని అభిషేకించే ఆలయం ఉపమాక ఒక్కటే అని ఆలయ విశిష్ఠతను తెలిపారు. నిత్యం ఉత్తర ద్వార దర్శనం జరిగే ఆలయం కూడా ఉపమాకే అన్నారు. నారదమహాముని చేతుల మీదుగా ఆలయం ప్రారంభించబడినట్లు పురాణాలు చెబుతున్నాయని హోంమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు ఎమ్మెస్ రాజు కూడా పాల్గొన్నారు.





