- శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ

నేటి సాక్షి, కోరుట్ల అర్బన్ (వీఆర్ ధర్మేంద్ర):- నేను, నాది, నా వల్లే అనే అహం భావన విడిచిపెట్టి మనస్ఫూర్తిగా రుద్ర ధ్యానం చేస్తే అంతా శివోహమేనని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో శ్రీలింగ మహాపురాణ సప్తాహం ముగింపు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, పురాణ కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజుల ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రవచనం చెప్పిన మహేశ్వర శర్మను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ముగింపులో భాగంగా మహేశ్వరశర్మ మాట్లాడుతూ దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టి శివున్ని అవమానించాలని చెడు ఆలోచనతో నష్టపోయిన కథను వివరించారు. ఎవరైతే ఆ పరమేశ్వరునికి వ్యతిరేకంగా ఆలోచిస్తారో, వ్యవహరిస్తారో వారికి ఓటమి తత్యమన్నారు. రుద్రుని నమ్ముకున్న వారికి అంత శుభమే జరుగుతుందని, అందుకే ఐశ్వర్యాన్ని, శుభాన్నిచ్చే ఈశ్వరున్ని శంకరుడని పిలుస్తున్నామని వివరించారు. కోరుట్ల సనాతన ధర్మ ప్రచార సమితి తలపెట్టిన అష్టాదశ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా జూలై 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు 3వ పురాణ ప్రవచన సప్తాహంగా ‘శ్రీనారద మహాపురాణం’ చెప్పబడుతుందని మహేశ్వరశర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోరుట్ల బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో అధ్యక్షులు పాలెపు రామకృష్ణశర్మ నేతృత్వంలో నిర్వహించిన రుద్రాభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివ లింగానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మహా అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు 12వందల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నీలి కాశీనాథ్, డాక్టర్ గండ్ర దిలీప్ రావు, వొటారి చిన్న రాజన్న, శక్కరి వెంకటేశ్వర్, ఒడ్నాల రామారావు, పొద్దుటూరి జలంధర్, వనపర్తి చంద్రం, మేడి కిషన్, రాచమడుగు శ్రీనివాసరావు, లింగ రాజు, నీలి శ్రీనివాస్, కొత్త వాసు, పల్లెర్ల మహేందర్, కటకం సదాశివ్, రాజేశ్వర్, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




